ఢిల్లీలో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం.. టేకాఫ్ రద్దు, ఆరుగురికి గాయాలు

  • ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో అప్రమత్తమైన పైలట్లు
  • ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా ప్రయాణికుల తరలింపు
  • ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
  • ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన ఎయిర్‌లైన్స్
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా ఖాళీ చేయిస్తుండగా ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

ఆదివారం తెల్లవారుజామున 1:08 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. LX147 విమానం రన్‌వేపై టేకాఫ్ కోసం వేగంగా వెళ్తుండగా ఇంజిన్‌లో సమస్యను సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి, ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. విమానంలో 232 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులతో పాటు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా కిందకు దించారు.

ఈ తరలింపు ప్రక్రియలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని చికిత్స కోసం మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటనకు గల కారణాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విమానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీకి తమ సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నామని ఎయిర్‌లైన్ పేర్కొంది. ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, హోటల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.

Swiss Airlines
Delhi Airport
Swiss Air LX147
Indira Gandhi International Airport
Zurich Flight
Emergency Landing
Flight Engine Failure
Medanta Hospital
Aviation Accident

More Telugu News